'ఒక దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం కన్నా పారిశుధ్యమే ముఖ్యం' అని పారిశుధ్య ప్రాముఖ్యత ను చాటిచెప్పిన మహాత్మా గాంధీజీ 150వ జన్మదినం నాటికి భారతదేశాన్ని 'బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశంగా' మార్చాలన్న సంకల్పంతో 2014లో 'స్వచ్ఛ భారత్ మిషన్' ప్రారంభించబడింది.2019 నాటికి ఈ మిషన్ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సంపూర్ణంగా సాధించినట్లు ఇటీవల మన దేశ ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో..గ్రామీణ భారతావని నిజంగా 'బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా మారిందా? వాస్తవాలను పరికించడంతో పాటు..నూరు శాతం అమలుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చిద్దాం.
స్వచ్ఛ భారత్ మిషన్ సాధించిన విజయాలు :
◆ గత 5 సంవత్సరాల కాలంలో సుమారు 100 మిలియన్లకు పైగా వ్యక్తిగత మరియు సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం.
◆వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఇళ్లల్లో స్థలాభావం మరియు ఇతర ఇబ్బందులు ఉన్నచోట సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం.
◆అంగన్వాడీలు,పాఠశాలలు, కాలేజీలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో 'ప్రజా మరుగుదొడ్ల' నిర్మాణం
◆మరుగుదొడ్ల నిర్మాణంలో రెడీమేడ్ టాయిలెట్లు, బయో టాయిలెట్లు వంటి నవకల్పనలు.
◆బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలంటే కేవలం టాయిలెట్స్ నిర్మాణంతోనే సాధ్యం కాదని గ్రహించి, వ్యక్తుల 'ప్రవర్తన మార్పుని' సాధించే ఉద్దేశ్యంతో 'బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్' మరియు ఐ.ఈ.సి (ఇన్ఫర్మేషన్..ఎడ్యుకేషన్.. కమ్యూనికేషన్) పై దృష్టి సారించడం.
◆'స్వచ్చ గ్రాహీ/స్వచ్ఛ ధూత్' ల నియామకం.
◆ 'అమితాబ్ బచ్చన్'వంటి ప్రముఖుల్ని ప్రచారకర్తలుగా నియమించుకుని దీన్ని ఒక
దేశ వ్యాప్త సామాజిక ఉద్యమంగా మలచడం.
◆సామాజిక తనిఖీలు చేపట్టడం..
గ్రామీణ భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు:
★మరుగుదొడ్ల నిర్మాణం జరిగినప్పటికీ.. వాటికి అవసరమైన నీటి సరఫరా లేకపోవడం.
★'వన్ సైజ్..ఫిట్ ఆల్' నిర్మాణ నమునాల్ని అనుసరించడం వలన తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఇవి నిరుపయోగంగా మారడం.
★అనేక చోట్ల నాసిరకం నిర్మాణాలు.
★నేటికీ ప్రజల్లో పూర్తిస్థాయిలో ప్రవర్తనా మార్పు సాధించలేకపోవడం వలన..అనేకమంది వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించుకున్నప్పటికీ.. బహిరంగ మలమూత్ర విసర్జనను విడనాడకపోవడం.
★జిల్లాలను 'బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా' ప్రకటించిన తర్వాత.. మరుగుదొడ్ల వినియోగంపై ప్రభుత్వ యంత్రాంగంలో నిర్లిప్తత చోటుచేసుకోవడం.
తీసుకోవాల్సిన చర్యలు:
◆నాసిరకం నిర్మాణాలను చేపట్టిన వారిపై చర్యలు తీసుకుని..వాటిని పునర్నిర్మాణం చేసి వినియోగంలోకి తీసుకురావడం.
◆విస్తృతంగా సామాజిక తనిఖీలను చేపట్టడం
◆మరుగుదొడ్లకు నీటి సదుపాయం కలుగజేయడం.
◆సామాజిక మరుగుదొడ్ల నిర్వహణకు ఉద్యోగుల్ని నియమించడం.
◆తక్కువ ఖర్చుతో మంచి నాణ్యమైన మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన నవకల్పనలు అవిష్కరించడానికి ప్రయివేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం.
◆విద్యావ్యవస్థలోని అన్ని స్థాయిల్లో 'బహిరంగ మలమూత్ర విసర్జన'వలన కలిగే నష్టాల్ని పాఠ్యాంశంగా చేర్చడం.
◆పౌర సమాజాన్ని, స్వచ్చంధ సంస్థల్ని మరింతగా భాగస్వాముల్ని చేయడం.
భారతదేశం 'బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశంగా' ప్రధాని ప్రకటించినప్పటికీ గ్రామీణ భారతావనిలో వాస్తవిక పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. స్వచ్చ భారత్ మిషన్ (గ్రామీణ) గణనీయమైన విజయాలను సాధించినప్పటికీ..నేటికి గ్రామాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన పూర్తిగా నిర్ములించబడలేదు. ఎందుకంటే ఇది కేవలం భౌతిక సదుపాయాలను కల్పిస్తే సరిపోయేది కాదు.. ప్రజల ఆలోచన, ప్రవర్తనలో శాశ్వతమైన మార్పుని సాధించాల్సిన అవసరం ఉంది. ఇందుకు నిరంతరం ప్రభుత్వం , పౌర సమాజం, స్వచ్చంధ సంస్థలు, యువత, విద్యార్థులు కృషి చేయాల్సిన అవసరం ఉంది.